వైఎస్ జగన్ సుదీర్ఘకాలం తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లక్ష్యంగానే ఆయన ఈపర్యటనను ఎంచుకున్నట్లు కనపడుతుంది. వెంకటగిరిలో జగన్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ ఆనం రామనారాయణరెడ్డిని టార్గెట్ గానే చేసుకుని మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. అందుకే వెంకటగిరి సభకు భారీ జన సమీకరణ లక్ష్యంగా వైసీపీ నేతలు పెట్టుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో తమ పార్టీ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికే జగన్ వెంకటగిరిని ఎంచుకున్నట్లు అర్థమవుతుంది. నేతన్న నేస్తం నిధులను విడుదల చేసేందుకు వైఎస్ జగన్ వెంకటగిరి చేరుకున్నారు.
ఎన్నికలకు ముందు…
ఆనం రామనారాయణరెడ్డి 2019ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి తిరిగి వైసీపీలోకి వచ్చారు. అయితే ఆయనకు 2019లో వెంకటగిరి నియోజకవర్గం టిక్కెట్ ను ఇచ్చారు. అక్కడి నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. కానీ తొలి విడత, మలి విడత ఆనం పేరును జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. రెడ్డి సామాజికవర్గం కావడం, పార్టీలో కొత్తగా వచ్చి చేరడంతోనే జగన్ ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణమని చెబుతారు. దీంతో ఆయన తరచూ పార్టీపైన, ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేసేవారు.
క్రాస్ ఓటింగ్ కు…
బహిరంగ విమర్శలు చేస్తున్నా పెద్దగా పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడటాన్ని తీవ్రమైన నేరంగా భావించిన జగన్ ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆనం సిద్ధమవుతున్నారు.
అభ్యర్థిని…
ఈ పరిస్థితుల్లో వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణరెడ్డిపై జగన్ విమర్శలు చేసే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎక్కడా ఆనం గురించి ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదు. అయితే ఈ సభలో ఆనంను లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాన్ని కొనసాగిస్తారని తెలిసింది. వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. తిరిగి వెంకటగిరిలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు జగన్ తన పర్యటన ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామ్ కుమార్ రెడ్డిని ఈ సభలో అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద జగన్ పర్యటన ఆనం టార్గెట్ గానే సాగనుంది.