మణిపూర్ అంశం పార్లమెంటు ఉభయ సభలను తాకడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమయింది. మణిపూర్ లో పరిస్థితులు అనుకూలంగా లేవని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.
డీఐజీ స్థాయి అధికారులు…
అందులో భాగంగా డీఐజీ స్థాయి అధికారులను మణిపూర్ కు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారులు మణిపూర్ కు వెళతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నాగాలాండ్ లోని కోహిమ, అసోంలోని సిల్వర్ నుంచి డీఐజీ స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం మణిపూర్ కు పంపింది. అక్కడి పరిస్థితులు చక్కపడేంత వరకూ అధికారులు అక్కడే ఉండి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను కూడా పెంచారు.