వాలంటీర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. వాలంటీర్ల వ్యవస్థపై విపక్షాల విమర్శలు, అధికార పక్షం ప్రశంసలు ఎన్నికల వరకూ కొనసాగేలా కనిపిస్తున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ వ్యవహారాన్ని ఎన్నికల వరకూ నడిపిస్తేనే తమకు లాభమని అధికార వైసీపీ డిసైడ్ అయినట్లు కనపడుతుంది. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రాసిక్యూషన్ కు అనుమతించింది. దీంతో పవన్ కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి విమర్శల జోరును మరింత పెంచనున్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య నలిగిపోతుందనే చెప్పాలి. వారి ప్రస్తావన లేకుండా రోజు గడపటం లేదు రాజకీయ పార్టీలు.
వాలంటీర్ల వ్యవస్థను…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ను వైసీపీ సర్కార్ నియమించింది. ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనంగా చెల్లిస్తుంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను లబ్డిదారులకు చేర్చడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. యాభై ఇళ్లలో ఒకరిని వాలంటీర్ గా నియమించడం, మొత్తం వాలంటీర్లలో అరవై శాతం మంది వరకూ మహిళలే ఉండటంతో అక్కడక్కడ విమర్శలు వచ్చినా టోటల్ గా ఆ వ్యవస్థపై ప్రజలకు గురి కుదిరింది. తమ పనులను ఉచితంగా చేసి పెట్టడం దగ్గర నుంచి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తుండటంతో ఎంతో వ్యయం, భారం తగ్గిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఫలితాలు ఇబ్బందిగా…
కానీ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఇబ్బందికరంగా మారతాయని విపక్షాలు భయపడుతున్నాయి. యాభై ఇళ్ల వారిపై వాలంటీర్లు ప్రభావం చూపుతారేమోనన్న భయం వారిపై విమర్శలకు దారి తీసిందనే చెప్పాలి. తొలినాళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టారు. గోనె సంచులు మోసే వాళ్లుగా మార్చారని, వేళకాని వేళలో ఇంటికి వెళ్లి తలుపుతడుతూ మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థ సేకరిస్తున్న డేటా బయట సంస్థలకు వెళుతుందని, ఇది ప్రమాదకరమని అనడమే కాకుండా మానవ అక్రమ రవాణా జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై అధికార వైసీపీ పవన్ ను ప్రాసిక్యూషన్ చేయాలని నిర్ణయించింది.
ఎన్నికల అంశంగా…
దాదాపు 2.50 లక్షల వాలంటీర్లు అంటే వారి కుటుంబాల ఓట్లతో పాటు ప్రజలు కూడా తమకు అండగా నిలబడతారని, విపక్షాలకు ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి అధికార పార్టీ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. అందుకే పవన్ పై ప్రాసిక్యూషన్ కు ఆదేశించారు. ఎన్నికల వరకూ వాలంటీర్ల వ్యవస్థను నడపాలన్నది అధికార పార్టీ లక్ష్యంగా ఉంది. ఈ వ్యవస్థపై ప్రజల్లో పోలింగ్ రోజు వరకూ నానేలా ప్లాన్ చేసినట్లు కనపడుతుంది. మరో వైపు పవన్ కల్యాణ్, చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడ్డారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రేపటి ఎన్నికలను ఇదే శాసిస్తుంది అన్నట్లు ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మరో తొమ్మిది నెలల పాటు వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో నలుగుతూనే ఉంటుంది. మరి చివరకు ఎవరిది గెలుపు అన్నది ఫలితాల తర్వాత కాని తెలియదు.