జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. పవన్ పై పరువు నష్టం కేసు దాఖలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. తప్పులు మీద తప్పులు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వం మరింత పలుచనగా మారుతుందని చంద్రబాబు మండి పడ్డారు.
తప్పేముంది?
పవన్ కల్యాణ్ ప్రశ్నించిన దానిలో తప్పేముందున్న చంద్రబాబు వ్యక్తిగత వివరాలను ఎలా సేకరిస్తారని నిలదీశారు. ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలన్నారు. రాజకీయ పక్షాలు ప్రశ్నించడానికే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవడం అధికార పార్టీ చేయాల్సిన పని అని చంద్రబాబు హితవు పలికారు. వ్యక్తిగత వివరాలను సేకరించడం నిబంధలకు విరుద్ధమన్న చంద్రబాబు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న జగన్ పైనే కేసు పెట్టాలని ఆయన మండిపడ్డారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి అసలు పరువంటూ ఉంటే కదా? పరువు నష్టం దావా వేయడానికని ఎద్దేవా చేశారు.