గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చాలు భయపడిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరసగా మూడు రోజులు ప్రభుత్వ సంస్థలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్…
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురం భీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. మూసీ నది పొంగి ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం కొంత తగ్గినా మధ్యాహ్నానికి మళ్లీ పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వణుకుతున్న హైదరాబాద్ వాసులు…
హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట, జనగాం, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు వానలతో ఇబ్బందిపడుతున్నారు. సోమవారం నుంచి తిరిగి కార్యాలయాలు తెరుచుకోనుండటంతో ట్రాఫిక్ సమస్య ను ఊహించుకుని ముందుగానే భయపడిపోతున్నారు. సాధ్యమయినంత వరకూ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.