వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు వరకూ బీసీలు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ కు మద్దతు తెలిపారు. బీసీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికల్లోనూ సూపర్ విక్టరీ కొట్టాలన్నది జగన్ ఆలోచన. అందుకే బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి రేసులో కూడా బీసీ పేరు వినపడుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు.
బీసీ నేతగా…
ప్రస్తుత టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పదవిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం వచ్చే నెల మొదటి వారంతో పూర్తవుతుంది. అయితే ఈసారి వైవీ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ ఎన్నికల సమయంలో పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని భావించిన జగన్ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని డిసైడ్ అయ్యారు. ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించయాయి. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే రెండుసార్లు టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనే ఛైర్మన్ పదవిలో ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో ఆయన సేవలు పార్టీకి అవసరమని భావించిన జగన్ బీసీ నేతకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నమ్మకమైన లీడర్ గా…
వైసీపీలో కీలక నేత, జగన్ కు నమ్మకమైన నేతగా ముద్రపడిన జంగా కృష్ణమూర్తి పేరు బాగా వినపడుతుంది. ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ ను చేస్తే బీసీలు మరింతగా పార్టీకి వెన్నంటి ఉంటారన్న ఆలోచనతో ఉన్నారు. జంగా కృష్ణమూర్తి తొలుత టీడీపీ నేత అయినా తర్వాత కాంగ్రెస్ లో చేరి గురజాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు తొలి ఎమ్మెల్సీ పదవిని కూడా జంగాకు ఇచ్చిన జగన్ బీసీ ఓటు బ్యాంకును రాబట్టుకోగలిగారు. మరి ఆ సెంటిమెంటో.. లేక జంగా వంటి నమ్మకస్థుడికి, ఆత్మీయుడికి టీటీడీ బాధ్యతలు అప్పగించాలనో తెలియదు కాని ఆయన పేరు దాదాపు ఖరారయినట్లు సమాచారం.
త్వరలోనే ఉత్తర్వులు?
బీసీలకు ఇప్పటికే వివిధ కార్పొరేషన్లతో పాటు మంత్రివర్గంలో కూడా అత్యధిక స్థానాలను ఇచ్చిన జగన్ కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవిని కూడా బీసీకే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుత టీటీడీ పాలకవర్గం పదవీ కాలం ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు ఇప్పటి నుంచే జగన్ కసరత్తు ప్రారంభించారు. జంగా కృష్ణమూర్తి అయితే అన్ని రకాలుగా బాగుంటుందని జగన్ ఈ నియామకం డిసైడ్ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేయనున్నారని తెలిసింది. ఛైర్మన్ గా అయితే జంగా పేరు ఖరారయింది కాని, పాలకవర్గ సభ్యుల పేర్ల మీద ఇంకా కసరత్తు జరుగుతుందని, ఈ కసరత్తు పూర్తయిన వెంటనే టీటీడీ ఛైర్మన్ గా జంగా నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.