బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో అనేక జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో మూడు రోజులు తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గంటలకొద్దీ ట్రాఫిక్…
హైదరాబాద్ లో రోడ్లమీద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిన్న రాత్రి నగరవాసులు నరకం చూశారు. కిలోమీటరు దూరానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ట్రాఫిక్ అస్తవ్యస్థంగా మారడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నిన్న సాయంత్రం నుంచి రోడ్లపై కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు బయలుదేరిన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బయటకు రాలేక…
సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఆఫీసు నుంచి బయలుదేరినా రాత్రి తొమ్మిది గంటలకు గాని ఇంటికి చేరుకోలేకపోయామాని నగరవాసులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల నీరు ఇంకా పోకపోవడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకునే వీలులేదని వాపోతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో నగరవాసులు భయపడిపోతున్నారు.