రైతులను జగన్ ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాగును జగన్ చంపేశాడని, రైతును నట్టేట ముంచాడని మండిపడ్డారు. వ్యవసాయంపై జగన్ కు ఎంత మాత్రం అవగాహన లేదన్న చంద్రబాబు గోదావరి జిల్లాల నుంచి రాయలసీమ వరకూ ఒక్క రైతు అన్నా బాగున్నాడా? అని ప్రశ్నించారు. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు మారాలని, జగన్ పాలనలో పుష్కలంగా సాగవుతున్న ఏకైక పంట గంజాయి మాత్రమేనని చంద్రబాబు అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో కల్లా మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. తప్పుడు లెక్కలు చూపించి ప్రజలను మోసం చేయడం జగన్ అలవాటుగా మార్చుకున్నాడన్నారు.
అప్పుల పాలు…
ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం 93 శాతం అప్పులపాలైందన్న చంద్రబాబు సగటు రైతు అప్పు 2,45,554 రూపాయలు అని వివరించారు. పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగేవని, చేతకాని ప్రభుత్వం కారణంగా భూముల ధరలు దిగజారి పోయాయయన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏపీ భూముల ధరలు, వ్యవసాయంపై కామెంట్స్ చేస్తున్నారని, రైతులు పంట పండిస్తే కనీసం కొనే దిక్కు కూడా లేదని అన్నారు. కనీసం ధాన్యం నింపుకోవడానికి సంచులు కూడా అందుబాటులో ఉంచని ఈ ప్రభుత్వం రైతును ఎలా ఆదుకుంటుందని ప్రశ్నించారు. జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు.