తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదం జరిగింది. తిరుపతి పట్టణంలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీనివాస సేతు నిర్మాణంలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తిరుపతి నగరంలో శ్రీనివాస సేతు పేరిట ఫ్లై ఓవర్ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది.
క్రేన్ వైర్లు తెగి…
అయితే రిలయన్స్ మార్ట్ ఎదురుగా వంతెనపై నిన్న రాత్రి నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. వంతెన చివరి సెగ్మెంట్ను ఏర్పాటు చేస్తున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు. అవిజిత్, బార్డోమండ ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇంకో వారంలో నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విషాదకరం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.