తెలంగాణలో మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్టులన్నింటిలో నీరు చేరి నిండుకుండలను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు కిందకు వరద నీటిని వదిలేస్తున్నారు. ఇప్పటికే అపార ఆస్తినష్టం సంభవించింది.
అనేక గ్రామాలు…
మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రహదారులపై నీరు ప్రవేశిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ సమీక్ష…
మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అన్ని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సహాయక బృందాలను నీట మునిగిన ప్రాంతాలకు పంపుతున్నాయి. కొందరు ప్రజలు తమ వస్తువులను, పాడి పశువులును గ్రామాల్లోనే వదిలి పునరావాస కేంద్రాలకు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.