వినుకొండలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని తెలిసింది. ప్రస్తుతం వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు గాయపడినట్లు తెలుస్తోంది. వినుకొండ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను కూడా పోలీసులు బంద్ చేశారు.
అవినీతి ఆరోపణలు…
పల్నాడు ప్రాంతమైన వినుకొండలో గత కొంతకాలంగా రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ నిరసన ర్యాలీలు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఈరోజు అది మరింత తీవ్రమై ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్లదాడిలో ఎమ్మెల్యే కారు ధ్వంసమయింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. వినుకొండకు అదనపు బలగాలు పంపాలని ఉన్నతాధికారులను స్థానిక అధికారులు కోరారు. లాఠీఛార్జి చేసి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో కొంత ఉద్రిక్తత ఇంకా నెలకొని ఉంది.