టిక్కెట్లు రెండు నెలలు ముందుగానే ఖరారు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన జాబితాను రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార వైసీపీ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ముందుగా వంద అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని తెలిసింది. తొలి జాబితాలోనే వంద మంది వరకూ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి వారిలో మరింత స్పీడ్ పెంచేందుకు టీడీపీ అధినేత సమాయత్తమవుతున్నారు.
సర్వేల ప్రకారం…
అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే లోకేష పాదయాత్ర పూర్తయిన నియోజకవర్గాల్లో సర్వే పూర్తయిందని, కొందరి అభ్యర్థుల పేర్లను లోకేష్ టీం కూడా చంద్రబాబుకు పంపిందని తెలిసింది. జనంలో వారు గత కొంతకాలంగా ఉంటూ సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు లోకేష్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్న వారికి టిక్కెట్లు దక్కే అవకాశముందని తెలుస్తోంది.
ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ…
లోకేష్ నుంచి కూడా చంద్రబాబు కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు జనం నుంచి వచ్చే రెస్పాన్స్ తో పూాటు హాజరైన ప్రజలు, స్వచ్ఛందంగా వచ్చారా? లేదా? అన్నది కూడా లోకేష్ టీం ఆరా తీస్తుందట. అలాగే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ ఛార్జి ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నారన్న విషయం కూడా లోకేష్ వెంట తిరుగుతూనే ప్రజల నుంచి సమాచారం సేకరించిందని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే ఈసారి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఈ టీం ఇచ్చే నివేదికలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారంటున్నారు.
పొత్తులు కుదిరినా…
మరోవైపు పొత్తులు కుదిరితే ఏ ఏ సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాలన్న దానిపై కూడా చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఆ ప్రకారమే మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి జనంలోకి పంపాలన్న వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు టిక్కెట్ కోసం పోటీ పడుతుండటంతో టిక్కెట్లు దక్కని వారు అసంతృప్తులు గురయినా వారిని బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందుకోసమే ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈసారి టిక్కెట్ వస్తుందో? రాదో? అన్న టెన్షన్ తో అనేక మంది ఆశావహులున్నారు.