బీఆర్ఎస్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మరోసారి విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా వనమాలంటేనంటూ ఆమె ఎద్దేవా చేశారు. రెండు రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు స్టే ఇవ్వాలని కోరినా హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
అఫడవిట్లన్నీ….
దొంగల్లా చలామణిఅవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంటూ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ను ఎమ్మెల్యేలు తప్పుదోవ పట్టించారంటూ మండిపడ్డారు. లెక్కకు రాని ఆస్తులను దాచి పెట్టి ఎన్నికల కమిషన్ ను మోసం చేశారని ఆమె విమర్శలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫడవిట్లు అన్నింటినీ తక్షణమే తనిఖీ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి షర్మిల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘాన్ని మాత్రమే కాకుండా ప్రజలను కూడా మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.