ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతుంది. పనులు లేక పేదలు పస్తులుండాల్సి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భయపెడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుందని సంతోషపడుతున్న సమయంలో మరో చేదువార్త వాతావరణ శాఖ తెలిపింది. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు.
మరో అల్పపీడనం….
అయితే దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జాతీయ రహదారిపైకి కూడా నీళ్లు చేరి రాకపోకలు స్థంభించాయి. ఎప్పుడూ లేని విధంగా ఆస్తినష్టం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించింది. ఈ పరిస్థితుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.