వెస్టిండీస్ లో పర్యటిస్తున్న భారత్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. నిన్న జరిగిన తొలి వన్డేలోనూ ఇండియా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్లు తడబడటంతో తొలి సెషన్ కే మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపింది. టాస్ నెగ్గిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. అనంతరం వరసగా వికెట్లను తీయడంలో భారత్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. దీంతో వెస్టిండీస్ ను 114 పరుగులకే భారత్ ఆల్ అవుట్ చేసేసింది.
స్పిన్నర్ల దెబ్బకు…
మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు తమ తడాఖా చూపించారు. కుల్ దీప్ యాదవ్, జడేజా స్పిన్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాటర్లు వరస పెట్టి పెవిలియన్ దారి పట్టారు. ముఖేష్ కుమార్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ లు తలో వికెట్ తీసుకోగా జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకుని వెస్టిండీస్ ను దారుణంగా దెబ్బతీశాడు.
అతి చిన్న లక్ష్యంతో…
యాభై పరుగులకు 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కూడా ఆదిలో తడబడింది. అయితే ఇషాన్ కిషన్ నిలదొక్కుకోవడంతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ చేయడంతో మ్యాచ్ భారత్ పరమయింది. 23 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 19, రవీంద్ర జడేజా 16, రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 52 పరుగులతో ఓపెనర్ గా వచ్చి రాణించడంతో విజయం భారత్ వైపే చూసింది