భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతుంది. గ్రామాలు.. పట్టణాలు అని లేకుండా వరద నీరు ప్రవేశిస్తుండటంతో ప్రజలు గత కొద్ది రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. కనీసం తాగునీరు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు భయపడిపోతున్నారు.
ఖమ్మం పట్టణంలో…
ఇదిలా ఉండగా పాములతో పాటు అనేక జంతువులు వరదల్లో కొట్టుకువస్తున్నాయి. ఖమ్మం పట్టణంలోని వెంకటేష్ నగర్ లో రోడ్డుపైకి అతి పెద్ద కొండచిలువ రావడంతో స్థానికులు భయపడి పోయారు. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలోని వెంకటేష్ నగర్ లో రోడ్డుపై పారుతున్న నీటిలోకి ఈ కొండ చిలువ వచ్చింది. దీంతో కొందరు యువకులు దీనిని పట్టుకుని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. కొండచిలువను అటవీ శాఖ అధికారులకు యువకులు అప్పగించారు. ఇక చిన్న చిన్న పాములయితే ఇళ్లల్లోకి వస్తుండటంతో జనం భయకంపితులవుతున్నారు.