వరదల దెబ్బకు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. విజయవాడ – హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి వరద నీరు కృష్ణా జిల్లాలోని కీసర వద్ద, నందిగామ ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవేశించడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నీరు హైవేపైకి చేరింది.
ప్రత్యామ్నాయ మార్గం….
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు వాహనాలను దారి మళ్లించారు. ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం మీదుగా ఖమ్మం రహదారిని చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవాలని పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువ కావడంతో ప్రయాణం ఆలస్యమవుతుంది. అనేక మంది హైదరాబాద్ రావడం కోసం అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలున్నాయని స్లోగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఖమ్మం వద్ద కూడా మున్నేరు రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.