బెజవాడలో బహిరంగంగా కిడ్నీల అమ్మకం సంచలనం కలిగిస్తుంది. కిడ్నీ అమ్మకాల పేరుతో ఒక ర్యాకెట్ వ్యవహారాన్ని పోలీసులు బయటకు తీశారు. అమాయకులను మోసం చేసేందుకు ఈ ర్యాకెట్ కిడ్నీలు విక్రయిస్తామని చెబుతూ నమ్మబలుతుకుంది. విజయవాడ గొల్లపూడికి చెందిన పేదింటి మహిళ చిన్నికి కిడ్నీ విక్రయిస్తే ఏడు లక్షల రూపాయలు ఇస్తామని ఈ ర్యాకెట్ ఆశ చూపింది. పేదరికంతో మగ్గిపోతుండటంతో చిన్ని కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
అనుమానమొచ్చి…
కిడ్నీ మార్చాలంటే న్యాయపరంగా కొన్ని చిక్కులుంటాయి. అధికారుల నుంచి కొన్ని సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కిడ్నీ తీసుకుంటున్న వ్యక్తి తన బంధువని చిన్ని అనే మహిళ చెప్పడంతో అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు కిడ్నీ ర్యాకెట్ గుట్టు బయటపడింది. చిన్నికి, రోగికి మధ్య ఏ మాత్రం బంధుత్వం లేదని తెలుసుకున్న పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
మహిళ వెనక….
అక్రమంగా కిడ్నీ అమ్మకాలు చేసే ముఠా చేసిన పని అని పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ జరపగా కిడ్నీ తీసుకునేందుకు సిద్ధమైన దీపక్ రెడ్డితో బేరం కుదుర్చుకున్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మహిళ వెనక మరొక ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని బృందాలు ఈ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అనుమానితులు తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇంకా ముఠాలో ఎవరెవరున్నారన్నది తెలియాల్సి ఉంది.