కొందరి రాత అంతే. ఫేడ్ అవుట్ లీడర్ల కింద జమ చేయాలా? లేదా వారికి ఇక పొలిటికల్ ఫేట్ ఇక లేదని అనుకోవాలా? అన్నది తేలకున్నా కొందరు నేతలు మాత్రం తెలియకుండానే తెరమరుగుఅయిపోతున్నారు. అటువంటి వారిలో మోత్కుపల్లి నరసింహులు ఒకరు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. దశాబ్దకాలం నుంచి ఆయన ఖాళీగానే ఉన్నారు. చివరి గెలుపు 2009లోనే. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయంగా ఎదగలేకపోయారు. పార్టీలు మారినా తలరాత మాత్రం మారలేదు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా…
తెలుగుదేశం పార్టీ నేతగా మోత్కుపల్లి నరసింహులు ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు. దళిత సామాజికవర్గానికి ప్రతినిధిగా ఆయన ప్రతి కార్యక్రమంలో కన్పించేవారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన టీడీపీలోనే కొనసాగారు. మధ్యలో కాంగ్రెస్ లోకి వెళ్లి వచ్చినా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదు. 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత తొలిసారి ఆలేరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985,1989, 1994, 1999 లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు బ్రేక్ సృష్టించారు.
గవర్నర్ అంటూ…
అనంతరం ఆలేరు నియోజకవర్గం జనరల్ కావడంతో ఆయన తిప్పలు ప్రారంభమయ్యాయి. . అయినా సరే తుంగతుర్తి నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. టీడీపీ, బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో కలసి ఉన్నసమయంలో ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయినా ఆ ఆశ మాత్రం నెరవేరలేదు. ప్రచారానికే పరిమితమయింది అలాంటి మోత్కుపల్లి నరసింహులు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు. అక్కడ ఇమడ లేకపోయారు. కేసీఆర్ పార్టీలో ఉంటే తనకు ఏదో ఒక పదవి రాకపోతుందా? అని భావించి కారు పార్టీలోకి జంప్ చేశారు.
కారు పార్టీలోనూ…
దళితబంధు పథకంతో కేసీఆర్ తన మనసును దోచుకున్నాడని చెప్పిన మోత్కుపల్లి నరసింహులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తొలి నాళ్లలో కేసీఆర్ కూడా ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. యాదాద్రికి తన వెంట తీసుకెళ్లారు. పక్కన చోటు కల్పించారు. అంతే ఇక మోత్కుపల్లికి పదవి గ్యారంటీ అనుకున్నారు. రాజ్యసభ అన్నారు.. కాదు.. కాదు.. ఎమ్మెల్సీ అంటూ తెగ ఊదరగొట్టేశారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాబట్టి ఆ మాత్రం ప్రయారిటీ మోత్కుపల్లికి లభించిందంటున్నారు ఆయన సన్నిహితులు. తర్వాత అనేక పదవులను భర్తీ చేసినా మోత్కుపల్లి వైపు మాత్రం కేసీఆర్ చూపు పడలేదు. దళిత నేతగా తనను కేసీఆర్ ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్న మోత్కుపల్లికి ఇక్కడా నిరాశే ఎదురయింది.
పోటీ చేస్తారా?
అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. తిరిగి ఆలేరు నుంచి పోటీ చేస్తానని మోత్కుపల్లి నరసింహులు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ లో ఇప్పటికే అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగడి సునీత ఉన్నారు. మరి మరోసారి పార్టీ మారతారా? లేక కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుని టిక్కెట్ తెచ్చుకుంటారా? అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి తమ నేతకు పదవి గ్యారంటీ అని మాత్రం ఆయన అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.