బీఆర్ఎస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ మండిపడ్డారు. వరదలు వచ్చి రాష్ట్రంలో అనేక మంది అవస్థలు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయని, పశువులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన చెందారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. వారికి నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డీకే అరుణ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టుకు తృటిలో ప్రమాదం తప్పిందని, దానికి గేట్లు కూడా సరిచేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె ఫైర్ అయ్యారు.
గతంలోనూ హామీ ఇచ్చి…
గతంలోనూ వరదలు వచ్చిన సమయంలో ఒక్కక్క కుటుంబానిక పదివేలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇంత వరకూ ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈసారి కూడా నష్టపరిహారం అందరికీ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశముందని తెలిపారు. బాధితులకు అండగా నిలవాల్సిన ఈ ప్రభుత్వం మాయమాటలు మాత్రమే చెప్పి తర్వాత మాత్రం పట్టించుకోలేదన్నారు. వెంటనే ఎంత నష్టం జరిగిందన్న అంచనాలను రూపొందించి అందరికీ సాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు.