వరద ప్రభావిత ప్రాతాల్లో ెలాంటి అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. వరదప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కొనసాగింపుపై ఆమె ఆరా తీశారు. వరద బాధితులందరికీ సాయం అందేలా చూడాలని ఆదేశించారు. క్లోరినేషన్ కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని, గ్రామాల్లో సురక్షితమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో…
అవసరమైతే పునరావాస కేంద్రాలను కొనసాగించాలని, బాధితులకు నచ్చ చెప్పి అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసి అన్ని వసతులు కల్పించాలని సీఎస్ అధికారులను కోరారు. గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆస్తులు కోల్పోయి అనేక మంది నిరాశ్రయులయ్యారు. పంట నష్టం తీవ్రంగా జరిగింది. కొన్ని గ్రామాలకు రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచపోయాయి. వీటన్నింటిపైనా జిల్లా అధికారులకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.