కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్రను నిర్వహించిన రాహుల్ మరోసారి పాదయాత్ర చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం రోడ్డు మ్యాప్ ను కసరత్తు చేస్తుననారంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అయితే బాగుంటుందన్న దానిపై సీరియస్ గా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే రాహుల్ మరోసారి నడక మొదలు పెట్టనున్నారు.
గత యాత్రలో…
రాహుల్ గాంధీ గత ఏడాది సెప్బంబరు 7వ తేదీన కన్యాకుమారిలో భారత్ జోడోయాత్రనున ప్రారంభించి ఈ ఏడాది జనవరి 30న జమ్మూలో ముగించారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలను మాత్రమే ఆయన పాదయాత్ర టచ్ చేయగలిగింది. రోడ్డు మ్యాప్ ప్రకారం ఆయన కొన్ని రాష్ట్రాల్లో కాలు మోపలేకపోయారు. ఆయన పాదయాత్ర తర్వాతే కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిగిలిపోయిన రాష్ట్రాల్లో కూడా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు.
రోడ్ మ్యాప్ కోసం…
ఇందుకోసం కార్యాచరణను రూపొందించాలని సీనియర్ నేతలకు రాహుల్ గాంధీ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది. గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి రెండో విడత పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. గుజరాత్ లో ప్రారంభించి త్రిపురలో ముగించేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారట. ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రోడ్డు మ్యాప్ ను రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు జరగనున్నాయి.
కూటమి కోసం…
దీంతో పాటు లోక్ సభ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతుంది. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలను కలుసుకోవాలన్న లక్ష్యంతో దేశమంతా పాదయాత్ర చేయాలన్న లక్ష్యంతో రెండో విడత పాదయాత్రకు రాహుల్ రెడీ అవుతున్నారు. తన నడక గెలుపు వైపు అడుగులు వేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఈసారి పశ్చిమం నుంచి తూర్పు వైపున ముగసేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారట. దీంతో పాటు “ఇండియా” కూటమి కూడా తన పాదయాత్రతో మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ మరో సుదీర్ఘ పాదయాత్రకు రెడీ అవుతున్నారు.