కాంగ్రెస్ సీనియర్ నేత వరద ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాచలంలో ఆయన పర్యటించి పరిస్థతిని సమీక్షించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే తరచూ భద్రాచలం ముంపునకు గురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం వరద బాధితులకు కూడా సరైన సమయంలో సాయం అందించలేకపోయారన్నారు. నష్టపరిహారాన్ని కూడా అందించకుండా బాధితులను మరింత ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గత వరదల్లో ప్రకటించిన సాయాన్నే ఇంత వరకూ ఇవ్వలేదన్నారు.
ఉత్తుత్తి హామీలే…
గతంలో భద్రాచలానికి వరదలు వచ్చినప్పుడు కరకట్ట నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని చెప్పి తర్వాత దాట వేశారన్నారు. బాధితులకు కూడా పరిహారం అందించలేదన్నారు. కిన్నెరసాని నదిపై వంతెనను మల్లు భట్టివిక్రమార్క పరిశీలించారు. అక్కడ పదహారు కోట్లతో కట్టిన చెక్ డ్యాం వరదలకు కొట్టుకుపోయిందన్నారు. నాసిరకం పనుల కారణంగానే ఈ విధంగా చిన్న స్థాయి వరదలకే కట్టడాలు కొట్టుకుపోతున్నాయని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
అధికారులు…
అధికారులు కూడా బీఆర్ఎస్ యంత్రాంగం చెప్పినట్లే నడుచుకుంటున్నారు తప్పించి, ప్రజలకు అవసరమైన పనులు చేయించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. చెక్ డ్యామ్ లు నాసిరకంతో నిర్మించారన్నారు. వరదల్లో అవి కొట్టుకుపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వరదలు వస్తాయని తెలిసి ముందుగా అధికారులను సమాయత్తం చేయకపోవడం వల్లనే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని అన్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.