తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించింది. దీంతో దాదాపు నలబై మూడు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కార్మికులకు మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పింది.
వరద నష్టం…
ఇటీవల తలెత్తిన వరదల కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించేందుకు తక్షణ సాయం కింద ఐదు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు. పంటనష్టం అంచనాలతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. నష్టం వివరాలు అందిన వెంటనే సాయం ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు వరదలకు దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మెట్రో విస్తరణ…
దీంతో పాటు హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్రోను విస్తరించాలని, ఇందుకు అరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిశ్చయించింది. జేబీఎస్ నుంచి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్, ఉప్పల్ నుంచి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగించనున్నారు. ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు ఉప్పల్ నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు. మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రోను విస్తరించనున్నారు.
ఎయిర్పోర్టును…
హకీంపేట ఎయిర్ పోర్టు ను పౌరసేవలకు వాడటానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్ ను నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలు మామూలేనని, ఎన్నికల్లో లబ్ది పొందడానికే కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.