వినుకొండ నియోజకవర్గంలోకి నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంది. లోకేష్ ఇప్పటి వరకూ 2264.9 కిలోమీటర్ల దూరం నడిచారు. 172వ రోజుకు యువగళం పాదయాత్ర చేరుకుంది. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఉదయం ఎనిమిది గంటలకు కెలంపల్లి శివారు నుంచి బయలుదేరిన లోకేష్ స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమావేశాలతో…
కొద్దిసేపటి క్రితం వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 8.55 గంటలకు ముప్పరాజువారి పాలెంలో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు. 10.10 గంటలకు రాముడుపాలెంలో స్థానికులతో సమావేశమయ్యారు. 11.10 గంటలకు పుచ్చనూతల జేసీ నగర్ కు చేరుకుని అక్కడి స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. 11.40 గంటలకు రవ్వవరంలో స్థానికులతో సమావేశం కానున్న లోకేష్ అనంతరం 12.10 గంటలకు పుచ్చనూతలలో భోజన విరామం కోసం ఆగుతారు.
సమస్యలు.. హామీలు…
భోజన విరామ సమయంలో జీసీ సామాజికవర్గీయులతో లోకేష్ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమై 4.20 గంటలకు కొత్తగూడెంలో స్థానికులతో భేటీ అవుతారు. సాయంత్రం 4.40 గంటలకు లక్ష్మీపురంలో స్థానికులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు నూజండ్లలో స్థానికులతో యువనేత లోకేష్ భేటీ కానున్నారు. అనతరం 7.10 గంటలకు గుర్రపునాయుడుపాలెంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను విని పరిష్కారానికి హామీలు ఇవ్వనున్నారు.
భారీ బందోబస్తు…
రాత్రికి గుర్రపునాయుడు పాలెం శివారులో లోకేష్ బస చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే వినుకొండలో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న నేపథ్యంలో పోలీసులు 144వ సెక్షన్ కూడా విధించారు. అయతే లోకేష్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వినుకొండ నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.