దాసోజు శ్రావణ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు పదవి దక్కడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా దాసోజు శ్రావణ్ కు పేరు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకంగా ఉన్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. సాఫ్ట్ వేర్ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన దాసోజు శ్రావణ్ తొలుత టీఆర్ఎస్ లో ఉన్నారు. 2014 ఎన్నికల అనంతరం తనకు ప్రాధాన్యత దక్కలేదని భావించిన దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.
ప్రజారాజ్యం నుంచి…
అంతకు ముందు 2008లో దాసోజు శ్రావణ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో యువనేత కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగేవారు. అయితే అక్కడా ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్ లో…
కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వంపై విరుచుకుపడే వారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన అక్కడ కూడా ఇమడ లేకపోయారు. తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన దాసోజు శ్రావణ్ భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.
శాసనమండలి సభ్యుడిగా…
బీజేపీలో కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు. వెనువెంటనే మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవి దక్కించుకున్నారు. దాసోజు శ్రావణ్ కుమార్ సేవలను గుర్తించిన పార్టీ హైకమాండ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేసింది. దీంతో ఆయన రెండున్నర దశాబ్దాల కల నెరవేరనుంది. చట్టసభల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న దాసోజు శ్రావణ్ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా మంత్రిమండలి ఎంపిక చేసింది. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన ఎమ్మెల్సీగా అయినట్లే. పార్టీలో చేరిన స్వల్ప కాలంలోనే ఆయనకు ఎమ్మెత్సీ పదవి దక్కింది.