ఫ్రీ బస్సు ప్రయాణంపై హైకోర్టులో ప్రజా ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మహిళ శక్తి పథకం కింద దీనిని సిద్ధరామయ్య సర్కార్ అమలు చేస్తుంది. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి వివాదాలే నడుస్తున్నాయి. మహిళలు బస్సుల్లో కొట్లాడుకుంటున్నారు. సీట్ల కోసం తన్నుకుంటున్నారు. ఘర్షణలతో ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇది ఒక వైపు నడుస్తుండగా మరొక వైపు ఆటో వాలాలు తమకు బేరాలు దొరకడం లేదని సమ్మెకు సిద్ధమవుతున్నారు.
కర్ణాటకలో…
మరోవైపు మహిళ శక్త ిగ్యారెంటీ పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో తమకు బస్సుల్లో చోటు దక్కడం లేదని విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు వాపోతున్నారు. తాము బస్సులు ఎక్కే పరిస్థితి లేక ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆర్టీసీ బస్సులు దొరకకపోవడంతో సకాలంలో కళాశాలలకు వెళ్లలేకపోతున్నామంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విద్యార్థులు వేశారు.
దివ్యాంగుల పరిస్థితి…
దివ్యాంగుల పరిస్థితి దారుణంగా ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. బస్సు ఎక్కాలంటే పోరాటం చేయాల్సిన పరిస్థిితి ఏర్పడిందని వారు పిటీషన్ లో ఆవేదన చెందారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఉచిత ప్రయాణం కోసం బస్సు మొత్తం కేటాయించడాన్ని తప్పుపట్టారు. కనీసం వృద్ధులు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో యాభై శాతం సీట్లను రిజర్వ్ చేయాలని వారు పిటీషన్ లో కోరారు. టిక్కెట్ కొనుగోలు చేసే వారికి సీట్లు లేకుండా, ఉచిత ప్రయాణికులకు సీట్లు ఎలా ఇస్తారంటూ వారు పిటీషన్ లో ప్రశ్నించారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.