రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నందికొట్కూరులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ముందుచూపుతోనే టీడీపీ నీటిపారుదల ప్రాజెక్టును చేపట్టిందని, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కోసం చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనీవా అని తెలిపారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించానని, రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా? రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండి పడ్డారు.
సీమ ప్రాజెక్టులు…
రాయలసీమలో తాము 12,400 కోట్లు ఖర్చుపెట్టామని, రాయలసీమ ద్రోహి జగన్ ఖర్చుపెట్టింది కేవలం రెండువేల కోట్లు మాత్రమే నని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించాలని తాను వచ్చానని, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి.. రాయలసీమకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారన్న చంద్రబాబు వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని చంద్రబాబు అన్నారు. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదన్నారు. తెలుగుగంగ, ముచ్చుమర్రి ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని, ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందన్నారు.
ముంచేస్తేనే…
రోడ్డుకు తట్టెడు మట్టి వేయలేరుగానీ.. మూడు రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులంటున్నారని, మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నామని, పరదాల మాటున కాదని, ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా జగన్? అంటూ సవాల్ విసిరారు. నందికొట్కూరుకు వచ్చి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటూ నిలదీశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పనిచేయని వైసీపీ నాయకులను మురికికాల్వలో ముంచేస్తేనే బుద్ధి వస్తుందన్నారు. బటన్ నొక్కుతున్నా అని జగన్ పదే పదే చెబుతున్నారని, బటన్ నొక్కడం కాదు అని, బటన్ బుక్కుడు ఎక్కువైందంటూ ఛలోక్తి విసిరారు.