భారత్ – వెస్టిండీస్ల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. కుర్రాళ్లు అదరగొట్టేశారు. తొలి మ్యాచ్ గెలిచి రెండో మ్యాచ్ ఓడిపోయిన భారత్ మూడో మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది. బ్యాటర్లు చెలరేగిపోయారు. సెంచరీలు, అర్ధసెంచరీలతో కుర్రాళ్లు కదం తొక్కారు. భారత్ బ్యాటర్లు చేసిన స్కోరు ముందు వెస్టిండీస్ జట్టు నిలబడలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు యాభై ఓవర్లకు 351 పరుగులు చేసింది.
భారత్ బ్యాటర్లు…
ఓపెనర్లు శుభమన్ గిల్ 92 పరుగులు, ఇషాన్ కిషన్ 77 పరుగులు చేసి ఆరంభం అదరహో అనిపించారు. తర్వాత బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ వెనువెంటనే అవుటయినా అనంతరం బరిలోకి దిగిన సంజూ శాంసన్ కేవలం 41 బంతుల్లోనే 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. రెండో మ్యాచ్ తరహాలోనే టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చి భారత్ ను కట్టడి చేయాలని భావించిన వెస్టిండీస్ కు నిరాశే ఎదురయింది. విండీస్ లో భారత్ అత్యధికంగా స్కోరు చేసినది ఈ మ్యాచ్ లోనే కావడం విశేషం.
సిరీస్ మనదే…
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును 151 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో రెండు వందల పరుగుల తేడాతో భారత్ వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. ముఖేష్ కుమార్ మూడు వికెట్లు తీసి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. మిగిలిప బౌలర్లు కూడా రాణించడంతో వెస్టిండీస్ జట్టు పెవిలియన్ బాట పట్టింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2 – 1 సిరీస్ తో కైవసం చేసుకుంది. ఈ వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలను విశ్రాంతినిచ్చి కుర్రాళ్లకు అవకాశమిచ్చారు.