ఎన్నికలకు సమయం ఇంకా రెండు మూడు నెలలు మాత్రమే ఉంది. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ప్రజల్లో పలుచన అవుతామన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు కూడా అనర్హత కేసులు ఎదుర్కొనుతుండటం గులాబీ పార్టీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. వనమా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన ఎన్నికల అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు హైకోర్టు గుర్తించి స్పష్టమైన తీర్పు చెప్పింది.
మంత్రిపై కేసు…
మరోవైపు మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికల అఫడవిట్ ట్యాంపరింగ్ చేశారంటూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. శ్రీనివాసగౌడ్ తో పాటు ఐఏఎస్ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కూడా తెలంగాణ హైకోర్టులో చేదు అనుభవం ఎదురయింది. తన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్ ను కొట్టివేయాలంటూ వేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలపై…
దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో వివిధ కేసులు విచారణలో ఉన్నాయి. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు పడటంతో తమపై కూడా ఇలాంటి తీర్పు వస్తుందేమోనన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం లేకపోవడం, 2018 ఎన్నికలకు సంబంధించిన అంశం కావడంతో పదవుల పరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ప్రజల్లో పలుచన అవుతామన్న భయం వారిని వెంటాడుతుంది. హైకోర్టు తప్పుపడితే జనం కూడా నమ్మి తమకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయరమోనన్న బెంగ బీఆర్ఎస్ నేతల్లో ఉంది.
ఎన్నికల సమయం కావడంతో…
ఈ ఎమ్మెల్యేలపై పడిన కేసులన్నీ 2018 ఎన్నికలు పూర్తయిన తర్వాత వేసినవే. ఆ కేసుల వాదనలు విని ఇప్పటికి తుది దశకు చేరుకున్నాయి. డిసెంబరు నెలలో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు చెబితే గులాబీ బాస్ కోర్టు తీర్పును సాకుగా చూపి టిక్కెట్ ఇవ్వరమో నన్న ఆందోళన కూడా అందరిలోనూ కనిపిస్తుంది. మొత్తం ఎన్నికల సమయంలో హైకోర్టులో మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు ఇప్పుడు భయపెట్టేవిధంగా ఉన్నాయి. మొత్తం మీద కోర్టు కేసులు గులాబీ పార్టీలో చర్చగా మారగా, కేసులు ఉన్న ఎమ్మెల్యేల ఇలాకాలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు తమకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.