సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చదువుకున్న వారిని భయపెట్టి తమ వలలో వేసుకుని లక్షలు దండుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి దాదాపు ఇరవై లక్షలు పోగొట్టుకున్న ఘటన హైదరబాద్ లో జరిగింది. హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన ఒక యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంది. గత నెల 26న ఆమెకు స్మిత అనే యువతి ఫోన్ చేసి మీ పేరిట మలేషియాకు పంపిన పార్సిల్ ముంబయికి తిరిగి వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పింది. తనకేం సంబంధం లేని ఆ యువతి చెపపినా ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుందంటూ మరో ఫోన్ ను కలిపింది. ఆమెతో మాట్లాడిన కేటుగాడు భయపెట్టి ఆధార్ కార్డు వివరాలను తీసుకున్నాడు.
భయపెట్టి…
ఆధార్ ఐడీ తనిఖీ చేశామని, హవాలా లావాదేవీలు ఉననట్లు తెలిసిందని చెప్పి బ్యాంకు అకౌంట్ నెంబర్ వివరాలను కూడా తీసుకున్నారు. సీబీఐ అధికారి పేరిట మరో వ్యక్తి వీడియో కాల్ చేసి బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, మీ కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుందని భయపెట్టాడు. వెంటనే ఒక బ్యాంకు యాప్ ద్వారా అప్పటికప్పుడు 19.94 లక్షల రూపాయలకు లోన్ కు అప్లయి చేయించి, డబ్బురాగానే తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాడని తెలిపారు. తర్వాత కేసులేమీ ఉండవని, సీబీఐ అధికారులు మీ ఇంటికి వచ్చి కేసును విత్ డ్రా చేస్తారని చెప్పాడు. అది నమ్మిన ఆ యువతి వారు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు 19.94 లక్షలు పంపింది. ఆ తర్వాత ఆ ఫోన్ కట్ అయింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.