దక్షిణ మధ్య రైల్వే కాకినాడ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సామర్లకోట స్టేషన్ లో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. కాకినాడ నుంచి గత కొంత కాలం నుంచి ఈ డిమాండ్ వినిపిస్తుంది. కాకినాడ ప్రయాణికులకు వందేభారత్ రైలును అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ ను చాలా కాలం నుంచి వినిపిస్తున్నారు. విశాఖ – సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇప్పటి వరకూ సామర్లకోటలో స్టాప్ లేకపోవడంతో కాకినాడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
నేటి నుంచే…
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సామర్లకోటలో వందేభారత్ రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నేటి నుంచి సామర్లకోటలో వందేభారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్ ఎక్స్ప్రెస్ 7.15 గంటలకు సామర్లకోట స్టేషన్ కు చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే ఈ రైలు సామర్లకోటకు రాత్రి 9.35 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.