తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయంపై ఒక క్లారిటీ రానుంది. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చివరి సమావేశాలు కావడంతో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకునే అవకాశాలున్నాయి.
ఆర్టీసీ విలీనం…
అధికార బీఆర్ఎస్ పార్టీ పలు కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ బిల్లును ఆమోదించనుంది. ఈ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును సభ ముందుంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులు కూడా సభముందుకు వచ్చే అవకాశముంది. అయితే ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఓట్లను ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకే కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెరతీశారంటూ విపక్షాలు ఆరోపించనున్నాయి.
గతంలో ఇచ్చిన హామీలు…
గతంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది అసంభవమని చెప్పిన కేసీఆర్ కు ఇప్పుడెలా సంభవమయిందన్న ప్రశ్నను విపక్షాలు లేవనెత్తనున్నారు. దీంతోపాటు వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై కూడా అధికార పక్షంపై విపక్షాలు విరుచుకుపడనున్నాయి. గత ఏడాది వరదలకు నష్టపోయిన వారికి కూడా సాయం అందించలేదని, నాడు ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ అమలు పర్చకుండా ప్రజలను, రైతులను మోసం చేస్తున్న విషయాన్ని సభ ద్వారా ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
ఇరుకున పెట్టేందుకు…
ఈ సమావేశాల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి మెట్రో విస్తరణపై కూడా చర్చజరగనుంది. దాదాపు 312 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని ఇటీవల మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా సభలో కీలకంగా మారనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్లు.. హైకోర్టు తీర్పు వంటి అంశాలపై కూడా విపక్షాలు సభలో ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేయనున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఇక వాకౌట్లు, సస్పెన్షన్లు షరా మామూలుగానే ఉంటాయని సీనియర్ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. మొత్తం మీద తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.