జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారు. వారాహి యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడంతో ఆయన మంగళగిరిలోనే ఉండి ఎన్నికలు ముగిసే వరకూ రాజకీయం అంతు తేల్చుకునేందుకే సిద్ధమయినట్లు కనిపిస్తుంది. జనసేన రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ ఎనిమిది నెలలు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన తనకంటూ ఒక వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పవన్ కొట్టే దెబ్బకు రాజకీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అవుతుందంటున్నారు జనసేన నేతలు.
పూర్తి స్థాయి రాజకీయం…
పవన్ కల్యాణ్ నిన్న మొన్నటి వరకూ పార్ట్ టైం పొలిటిషియన్ గానే ఏపీ ప్రజలకు కనిపించారు. కానీ ఇకపై పూర్తి స్థాయి రాజకీయాలు చేయడానికి రెడీ అయిపోయారు. మంగళగిరిలోనే నివాసం ఉండి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపైన కూడా పవన్ కు ఒక స్పష్టత ఉంటుందంటున్నారు. ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతుంది. అదే పొత్తు కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు. రెండు పార్టీలకు తోడుగా తెలుగుదేశం పార్టీ కూడా జత అవుతుందని, అప్పుడు అధికార వైసీపీని ఓడించడం ఖాయమని జనసేన నేతలు ఢంకాభజాయించి చెబుతున్నారు.
అరవై స్థానాలకు పైగానే…
ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇరవై నుంచి ముప్ఫయి సీట్లు ఇస్తే ఒప్పుకునేది లేదన్న సంకేతాలను కూడా ఇప్పటికే పంపినట్లు తెలిసింది. అరవైకి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారని చెబుతున్నారు. ఈ అరవై స్థానాల్లో కనీసం నలభై నియోజకవర్గాల్లో గెలవగలిగితే ఇక ముఖ్యమంత్రి పదవి దక్కినట్లేనని నమ్ముతున్నారు. పవన్ ఇప్పటికే తనకు, తన పార్టీకి రాయలసీమలో పెద్దగా పట్టు లేదని ఆయన బహిరంగంగా అంగీకరించారు. తనకు పట్టుఉందల్లా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మాత్రమేనని, అందుకే ఆ ప్రాంతంలోనే ఎక్కువ స్థానాలను తమ పార్టీ కోరుతుందని చెబుతున్నారు.
బలంగా ఉన్న ప్రాంతాల్లో…
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ జనసేన బలంగా ఉందదన్నది ఆ పార్టీ నేతల వాదన. చంద్రబాబు, జగన్ పాలన చూసిన ప్రజలకు ఒకసారి పవన్ పాలనను కూడా చూడాలన్న కోరికతో ఉన్నారని వారాహి యాత్రలో బయటపడిందంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇరవైకి పైగా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని అంటున్నారు. అక్కడ ఖచ్చితంగా గెలుపు తమదేనని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో కూడా తమ పార్టీకి అనుకూలమైన స్థానాలున్నాయంటున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులలో కూడా కొన్ని స్థానాల్లో జనసేన బలంగా ఉందని చెబుతున్నారు. అందుకే తాము ఈసారి తగ్గేదేలే అంటూ ఇటు వైసీపీకి, అటు మిత్రపక్షంగా మారబోయే పార్టీలకు పరోక్ష వార్నింగ్లను జనసేనాని బలంగా పంపుతున్నారు. ఎన్నికల అనంతరం తామే కింగ్ మేకర్ గా మారతామని నమ్ముతున్నారు.