చినికి చినికి గాలి వాన అయినట్లు “బ్రో” సినిమా వివాదం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిశారు. “బ్రో” సినిమాలో తన పాత్రను పెట్టి కించపర్చారంటూ మంత్రి అంబటి రాంబాబు గత కొద్ది రోజుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను సంక్రాంతి రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో జనంతో కలిసి డ్యాన్స్ చేస్తే దానిని సినిమాలో పెట్టి తనను దూషించి పైశాచికానందం పొందారని ఆరోపించారు.
విదేశీ నిధులను…
అంబటి రాంబాబు అంతటితో ఆగకుండా “బ్రో” సినిమా నిర్మాత విదేశాల నుంచి నిధులను ఇక్కడకు తెచ్చి వైట్ గా మార్చి పవన్ కల్యాణ్కు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పెద్దయెత్తున మనీ లాండరింగ్ ఈ సినిమా ద్వారా జరిగిందని ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను ఎందుకు ఢిల్లీ వెళ్లింది ఇప్పుడే చెప్పనని, పర్యటన పూర్తయిన తర్వాత మాత్రమే చెబుతానని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు.
మనీలాండరింగ్…
ఆయన “బ్రో” సినిమా ద్వారా జరిగిన మనీ లాండరింగ్ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వెళ్లారంటున్నారు. పవన్ కల్యాణ్ కావాలని తనను లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో సయితం వదలకపోవడంతో న్యాయపరంగా, చట్టపరంగా సినిమా టీంను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యం అంబటిలో కనిపిస్తుంది. రాజకీయంగా తనపై ఎన్ని విమర్శలు చేసినా పరవాలేదు కానీ, సినిమాల్లోనూ తనను ఎగతాళి చేస్తూ సీన్లు క్రియేట్ చేయడం సరికాదని అంబటి అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నిధులను…
ప్రధానంగా “బ్రో” సినిమా నిర్మాత విశ్వప్రసాద్ టీడీపీకి అనుకూలంగా మారి ప్యాకేజీ రూపంలో పవన్ కల్యాణ్ కు ఈ సినిమా ద్వారా నిధులు అందించారని ఆరోపణ ఉంది. అలాగే అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీకి యజమానిగా ఉన్న విశ్వప్రసాద్ అక్కడి టీడీపీ సానుభూతిపరులైన ఎన్ఆర్ఐల నుంచి సేకరించిన నిధులను ఇక్కడకు హవాలా మార్గం ద్వారా తెచ్చారని కూడా అంబటి ఆరోపణ చేస్తున్నారు. దీనిపై అంబటి రాంబాబు ఈరోజు ఢిల్లీలోని సీీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద అంబటి ఢిల్లీ టూర్ ఏ మలుపులకు దారితీస్తుందో చూడాలి.