వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ టీ 20లో మాత్రం కొంత నిరాశాజనకంగా ఆట కనపర్చింది. లక్ష్యం చిన్నదైనా ఛేదించలేక టీం ఇండియా చతికల పడింది. తొలి టీ 20ని చేజార్చుకుంది. మొత్తం ఐదు టీ 20ల మ్యాచ్ గల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే భారత్ తడబడటం కుర్రకారు సత్తాను చాటి చెబుతుంది. బౌలింగ్ పరంగా సత్తా చాటినప్పటికీ, బ్యాటింగ్ పరంగా మాత్రం భారత్ చేతులెత్తేసింది. అయితే గుడ్డిలో మెల్లగా హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పుణ్యమా అని అతి తక్కువ పరుగులతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
తక్కువ పరుగులకే…
టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లకు 149 పరుగులు చేసింది. ఐపీఎల్ జట్టులో ఉన్న ఆటగాళ్ల పరంగా చూసుకుంటే ఈ స్కోరును ఉఫ్ మని ఊదేయాల్సిన మ్యాచ్ ను వదిలేశారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ పావెల్ 48, నికోలస్ పూరన్ 41 పరుగులు చేసి రాణించారు. ఓపెనర్ కింగ్ కూడా కాసేపు ఇండియన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. అయితే యజువేంద్ర చాహల్ దెబ్బకు వరసగా వికెట్లు పడిపోవడంతో విండీస్ తక్కువ స్కోరునే చేయగలిగింది.
ఇండియన్ బ్యాటర్లు…
అనంతరం బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే తడబడింది. గిల్ పరుగులేమీ పెద్దగా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్ కూడా నిరాశపర్చాడు. సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేసి కొన్ని షాట్లు కొట్టి స్టేడియంలో భారత్ కు కొంత ఊపు తెచ్చాడు. ఇక హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరకు విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొలి టీ 20 ఆతిధ్య జట్టు విండీస్ పరమయింది.