తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలోని కియా పరిశ్రమ వద్ద సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్టు నుంచి కియా కార్ల పరిశ్రమకు అవసరమైన నీటి సరఫరాను రికార్డు సమయంలో చేశానని తెలిపారు.
యాభై మూడు వేల కోట్ల పన్ను….
అందువల్లనే పదమూడు వేల కోట్ల రూపాయలతో కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. కియా కార్ల పరిశ్రమ ఇటీవల పది లక్షల కార్ల ఉత్పత్తి పూర్తి చేసుకున్నదని, కియా యాజమాన్యం కార్ల అమ్మకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై ఆరువేల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా చెల్లించిందని చెప్పుకొచ్చారు. మంచికి, చెడుకు మధ్య విశ్లేషణ చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేను కూడా ఓడించారని, ఈసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.