ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సత్వరం అమలు చేసేందుకు సిద్ధమయింది. రైతు రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు గత ఎన్నికల్లో మిగిలి పోయిన హామీలను తక్షణమే అమలు చేసేలా కార్యాచరణ సిద్ధమయింది. అయితే ఇందుకు నిధుల కొరత పట్టి పీడిస్తుంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నిధుల కొరత…
అయితే వీటన్నింటికీ నిధులు కావాల్సి ఉంది. ఇందుకోసం తెలంగాణ సర్కార్ భూముల అమ్మకాలకు సిద్ధమయింది. ఇప్పటికే కోకాపేట్ లోని భూములకు అత్యధిక ధరలు లభించడంతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న భూములను కూడా విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్ శివారులో ఉన్న వంద ఎకరాలకు వేలానికి సిద్ధమయింది. బుద్వేల్ లో ఉన్న వంద ఎకరాలకు నిర్ణీత కనీస ధర 20 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. అంటే రెండు వేల కోట్ల రూపాయల లక్ష్యంగా వేలం వేయనుంది. మరి ఈ భూములు ఎకరా ఎంత ధర పలుకుతుందన్నది ఈ నెల 10వ తేదీన జరిగే వేలంలో తెలియాల్సి ఉంది.