ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పొత్తులపై ఇంకా స్పష్టత రాకున్నప్పటికీ ఎవరికి వారే టిక్కెట్లు ప్రకటించుకోవడం చర్చనీయాంశమైంది. ఎవరికి బలం ఉన్న ప్రాంతంలో వారు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారా? లేక ముందుగానే ఒప్పందం మేరకు కొందరు అభ్యర్థుల పేర్లను ఖారరు చేస్తున్నారో తెలియదు కాని, తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు అభ్యర్థులను ఖరారు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కాదు రెండు పార్టీల్లో చర్చనీయాంశమైంది.
నాదెండ్ల అభ్యర్థిత్వాన్ని…
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి నియోజకవర్గం అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. నాదెండ్లకు తెనాలి నియోజకవర్గంలో గట్టి పట్టుందని ఆయన తెలిపారు. ఈసారి ఆయనను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. నిజానికి తెనాలిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన తొలి నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అంటే పొత్తు కుదిరితే తెనాలి సీటును టీడీపీ వదులుకోవాల్సిందేనని పవన్ నేరుగా చెప్పినట్లయింది.
పొత్తులు కుదరకముందే…
పొత్తులు కుదరకముందే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళితే ఎలా? అన్న ప్రశ్న రెండు పార్టీల నుంచి వస్తుంది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గత ఎన్నికల్లోనూ అత్యధిక ఓట్లను సాధించారని, ఆయన అయితేనే అక్కడ గెలుపు అవకాశాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనను కాదని సీటు నాదెండ్ల మనోహర్కి ఇవ్వడం అన్యాయమని ఆలపాటి అనుచరులు ఇప్పటికే కామెంట్స్ పెడుతున్నారు. పవన్ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా తెలుగుదేశం పార్టీ అధినేత వెంటనే బహిరంగంగా రియాక్ట్ కాలేదు కానీ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కదిరి అభ్యర్థిని..
తాజాగా రాయలసీమ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా అభ్యర్థిని ప్రకటించారు. కదిరి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ పేరును ఆయన ఖరారు చేశారు. అనంతపురంలో కదిరి నుంచి తాము పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కదిరి అభ్యర్థిని ప్రకటించడం కూడా జనసేనకు ఇబ్బందిగా మారింది. ఇలా రెండు పార్టీలూ ఒకరికొకరు పొత్తులు కుదరకముందే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళితే నేతల్లో గందరగోళం నెలకొంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పొత్తులు కుదరడానికి ఇంకా సమయం ఉంది. అంత వరకూ వేచి చూడకుండా అభ్యర్థుల ప్రకటన చేయడంతో రెండు పార్టీల్లో గందరగోళం నెలకొంది.