టమాటా ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. పేద ప్రజలు టమాటాకు దూరమై చాలా రోజులయింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు టమాటాను కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. టమాటా వారి ఇళ్లకు చేరి నెలలు గడుస్తుంది. ప్రస్తుతం కిలో టమాటా ధర రెండు వందల రూపాయలు పలుకుతుంది. అయితే సామాన్యులకు అందుబాటులో లేని టమాటా తమకు అవసరం లేదని ఒక గవర్నర్ తన పెద్దమనసును చాటుకున్నారు. రాజ్భవన్ లో మెనూ నుంచి టమాటాను తొలగించాలని గవర్నర్ ఆదేశించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గవర్నర్ ఆదేశాలు…
పంజాబ్ గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ తన మెనూ నుంచి టమాటాను తొలగించారు. ధరలు తగ్గేంత వరకూ రాజ్భవన్ లో టమాటా సంబంధమైన వంటలు ఏదీ వండకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. అనేక కారణాలతో టమాటా ధరలు పెరిగాయని, పేదలకు అందకుండా పోయిందని భన్వరీలాల్ పురోహిత్ అన్నారు. అందుకే పేదలకు మద్దతుగా రాజ్భవన్ లో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.