చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన రక్తసిక్తంగా మారింది. అంగళ్లులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పట్టారు. రాళ్లదాడిలో పోలీసులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ నని, పోలీసులకు రోషం ఉండాలని, రోషం లేని జీవితం నాశనం అని చంద్రబాబు అన్నారు. మర్యాదగా ఉంటే తాను కూడా మర్యాదగా ఉంటానని తెలిపారు. ఏయ్ పోలీస్ బట్టలిప్పుకో అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పిల్లి కూడా రూములో పెట్టి కొడితే పులిగా మారుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మగాళ్లయితే…
మగాళ్లయితే పోలీసులు లేకుండా రావాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు సవాల్ విసిరారు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. దెబ్బలు తగిలినా, తలలు పగిలినా భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. మగాళ్లయితే పోలీసులు లేకుండా రావాలని, తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. కేశప్ప డీఎస్పీకి అప్పీల్ చేస్తున్నా.. వారికి ఊడిగం చేయవద్దని కోరుకుంటున్నానంటూ ఆయనపై కూడా మండి పడ్డారు. కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్ లతో కాల్పులను జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుల్స్కు గాయాలయ్యాయి.