అధికార పార్టీపై సహజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా స్థానిక నాయకత్వం పట్ల ప్రజలు విసిగి వేసారి పోయుంటారు. తమ సమస్యలను పరిష్కరించకుండా నానుస్తూ ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకూడదని ప్రజలు తీర్మానించుకుంటే అధికార పార్టీ ఎన్ని వరాలు ప్రకటించినా చేసేదేమీ ఉండదు. అలాగే పార్టీని, అధినేతను చూసి ఓట్లు వేయడం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. ఎక్కువగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న వ్యతిరేకత అధికార పార్టీకి ఎన్నికల్లో సెగ తగలక మానదు. అనేక ఎన్నికల్లో ఫలితాల తర్వాత దీనిని స్పష్టంగా చూశాం.
గత ఎన్నికల్లో…
2018 ఎన్నికల్లో నలుగురు మంత్రులు దారుణంగా ఓటమి పాలయ్యారు. అప్పుడు కూడా ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే పథకాలున్నాయి. కానీ మంత్రులు ఎందుకు ఓటమిపాలయ్యారు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం మాత్రం ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే. 2018 ఎన్నికల్లో మంత్రులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావులు ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతటా కారు గాలి వీచినా వారి నియోజకవర్గాల్లో మాత్రం కారు జోరు కనిపించలేదు. మరోసారి గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రులు అయ్యే చాన్స్ వీరు పోగొట్టుకున్నారు.
నేడు మరింత మంది…
ఇప్పుడు కూడా అదే తరహాలో పరిస్థితి ఉందంటున్నారు. అయితే ఈసారి నలుగురుకు మించి మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నట్లు గులాబీ బాస్ కు నివేదికలు అందినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వేలు చేయిస్తుంటారు. నియోజకవర్గాల్లో వారి పనితీరును సమీక్ష చేస్తూ హెచ్చరిస్తుంటారు. కానీ కేసీఆర్ కేబినెట్ లో ఎక్కువ మంది మంత్రులకు ఈసారి గండం పొంచి ఉందని నివేదికలు అందడంతో ఆయన వారిని పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని తెలిసింది.
ఇవే కారణాలు…
ప్రజా సమస్యలపై సత్వరం స్పందించకపోవడం, జనాలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మంత్రులు ఎమ్మెల్యేల కంటే వెనుకబడి ఉన్నారు. వీరిలో సీినియర్ మంత్రులు కూడా ఉన్నారు. ఒక్కొక్క మంత్రి రెండు సార్లు గెలిచిన వారు ఉండటంతో మూడో సారి గెలుపు కష్టమేనని అంటున్నారు. ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్లినా జనం నుంచి వారికి నేరుగా వ్యతిరేకత ఎదురుకాక తప్పదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న విషయం. దీంతో వారిని మారుస్తారా? లేక కొనసాగిస్తారా? అన్నది కేసీఆర్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఈసారి మంత్రుల్లో ఎక్కువ మంది డేంజర్ జోన్ లో ఉన్నట్లు అందుతున్న నివేదికలు పార్టీ అగ్రనేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.