సహజంగా తెలుగుదేశం పార్టీ నేతల నోటి నుంచి వచ్చేది పులివెందుల రాజకీయం. పులివెందుల పంచాయతీ. ఫ్యాక్షన్కు పెట్టింది పేరు అంటూ ఉంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటన పులివెందులలో మాత్రం సాఫీగా సాగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు వెళ్లి చంద్రబాబు గర్జించినా అక్కడ ఏమీ కాలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలగలేదు. జగన్ను సైకో అన్నా, తూలనాడినా అక్కడ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ పులివెందుల నుంచి పుంగనూరుకు వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. రణరంగరం జరిగింది. రక్తసిక్తమయింది. ఎందుకిలా? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
పులివెందులలో…
పోలీసుల వైఫల్యమా? లేక పార్టీ నేతలే కారణమా? అన్న చర్చ జరుగుతుంది. నిజానికి చంద్రబాబు పులివెందులలో పర్యటించినప్పుడే ఏదో ఒక రగడ జరగాల్సి ఉంది. అక్కడ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. కానీ పుంగనూరు చేరుకునేలోపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నాయి. నిజానికి ప్రశాతంగా ఉండే చిత్తూరు జిల్లాలో ఈసారి ఎందుకింత రగడ జరగుతుందన్నది ఎవరికీ అర్ధంకాని ప్రశ్న. అందునా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు, ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లెలోనే గొడవలు జరగడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైసీపీ వాదన…
చంద్రబాబు ఓటమి భయంతోనే క్యాడర్ను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కల్గించాలని ముందుగానే స్కెచ్ వేసి ఈ అల్లర్లకు ప్లాన్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పుంగనూరు బైపాస్ రోడ్డు నుంచి చిత్తూరు వెళ్లాల్సిన చంద్రబాబు అనుమతి లేని పుంగనూరులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి రెచ్చగొట్టారన్నది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం వల్లనే నిన్న ఘటనకు కారణమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కేంద్ర బలగాలను మొహరించి రాష్ట్ర పోలీసులను తప్పించాలన్న వ్యూహంతోనే ఇలాంటి దాడులకు టీడీపీ క్యాడర్ తెగబడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీ ఆరోపణలు…
టీడీపీ నేతలయితే ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అడ్డాగా మార్చుకున్నారని, అక్కడ పర్యటించడానికి ప్రతిపక్షనేతకు కూడా అనుమతి లేక పోతే ఎలా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్న సంగతి పుంగనూరు ఘటనతో స్పష్టమయిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనను విధించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తుందన్నది పచ్చ పార్టీ నేతల వాదనగా ఉంది. మొత్తం మీద పులివెందులలో చంద్రబాబు టూర్ ప్రశాంతంగా జరగడం పుంగనూరుకు వచ్చే సరికి రభస జరగడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది.