రాజ్భవన్ ముట్టడికి వస్తున్న ఆర్టీసీ యూనియన్ నేతలను గవర్నర్ ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుదుచ్చేరి నుంచి ఇక్కడి ఆర్టీసీ యూనియన్ నేతలతో మాట్లాడతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మంత్రిమండలి ఆమోదించి గవర్నర్ కు పంపింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న తరుణంలో గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే తమ దీర్ఘకాలిక కోరిక నెరవేరదని ఆర్టీసీ కార్మికులు చలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. గవర్నర్ ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది. మొత్తం పది మంది ఆర్టీసీ యూనియన్ నాయకులను రాజ్భవన్లోకి పోలీసులు అనుమతించనున్నారు.
వీటికి జవాబేదీ?
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రశ్నలు వేశారు. పుదుచ్చేరిలో ఉన్న ఆమె ఈ ఐదు ప్రశ్నలకు తనకు ఆన్సర్ ఇవ్వాలని కోరారు. 1958లో ప్రారంభమైన ఆర్టీసీలో 35 శాతం కేంద్రం వాటా ఉందని, దానిని ఏం చేయబోతున్నారు? అలాగే విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో కార్పొరేషన్లో విలీనం చేస్తున్నప్పుడు బిల్లులో ఎందుకు వివరాలు పొందపర్చలేదని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వోద్యోగుల మాదరిగా పింఛన్లు, జీతభత్యాలు ఇస్తారా? అని కోరారు. అలాగే కండక్టర్, కంట్రోలర్ పోస్టులను ఎలా క్లియర్ చేస్తారని కూడా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు తాను వ్యతిరేకం కాదని, గతంలో కూడా తాము ఆర్టీసీ ఉద్యమానికి మద్దతిచ్చిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. అయితే రాజ్భవన్ ముట్టడి తనను బాధించిందన్న తమిళిసై కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే తన ప్రయత్నమని తెలిపారు.