భారత్ లో విపక్షాల కూటమి ఇప్పటి వరకూ బలంగానే ఉంది. ఈ నెలలో మరోసారి ముంబయిలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత వచ్చే ఎన్నికలలో పోటీపై కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ నాయకత్వంలోనే కూటమి వెళ్లేందుకు దాదాపు అన్ని పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమను పెడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే మోదీ ప్రభుత్వం దిగిపోవాలన్న లక్ష్యం.. కసి ఇండియా నేతల్లో కనిపిస్తుంది. అందుకే వెంటవెంటనే సమావేశాలు పెట్టుకుని మోదీని ఎదుర్కొనడంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సిద్ధం చేసుకోనున్నారు.
పదేళ్ల నుంచి…
పదేళ్ల నుంచి మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని “ఇండియా” కూటమి అంచనా వేస్తుంది. కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనంగా చెబుతుంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగే ముందు అలర్లను రేపడం, హిందూ మతతత్వంతో ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగానే మణిపూర్, హర్యానా అల్లర్లు అంటూ విపక్షాలు ఇప్పటికే పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మాత్రమే కాకుండా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ రకమైన ప్రచారం ఊపందుకుంది.
ప్రచారం ముమ్మరం…
ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో “ఇండియా” కూటమిపై ప్రచారం ఊపందుకుంది. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమంటూ పోస్టర్లు వేశారు. అబ్ కీ బార్ ఢిల్లీ మే ఇండియా సర్కార్ అంటూ పోస్టర్లు బెంగాల్ అంతటా వెలిశాయి. ఇప్పుడు దేశమంతటా ఈ పోస్టర్లు వేయడానికి “ఇండియా” కూటమి సిద్ధమవుతుంది. ప్రజల్లో చైతన్యం తేవడానికి, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన ధరలపై కూడా త్వరలో పోస్టర్లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా…
దీంతో పాటు “ఇండియా” కూటమిలో ఉన్న 26 పక్షాల నేతలు కూడా దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అప్పుడే విపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో విశ్వాసం నెలకొంటుందని, తద్వారా మోదీ సర్కార్ను సులువుగా ఎదుర్కొనవచ్చన్న ఆలోచనలో కూటమి నేతలున్నారు. దీనిపై ముంబయి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ కూడా రెండో విడత పాదయాత్ర ప్రారంభించి కూటమికి మరింత బలాన్ని తేనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద పదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారన్న ఆత్మవిశ్వాసం “ఇండియా” కూటమి నేతల్లో కనిపిస్తుంది. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.