ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూమన కరుణాకరెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతారు. తనను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నియమించిన జగన్ కు భూమన కరుణాకరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా భూమన ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో…
అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కూడా స్పష్టం చేశారు. తన కుమారుడికి ఆ అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరినట్లు తెలిసింది. నిజానికి భూమనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. రెండుసార్లు విస్తరణ జరిగినా జగన్ సామజిక సమీకరణాల్లో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డికి తన మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. దీంతో ఆయన కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు.
గతంలో పనిచేసిన…
ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డిని పిలిపించుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలోనూ ఆయన టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించారు. ఆయన పని చేసిన కాలంలో కల్యాణమస్తు కార్యక్రమంతో పాటు ఉచిత సామూహిక వివాహాలను టీటీడీ జరిపింది. అనుభవం ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని తిరిగి టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని జగన్ ఆలోచించారంటున్నారు. ఇప్పటికే నాలుగేళ్లుగా ఛైర్మన్ గా పనిచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకోనున్నారు.