ఏ యుగం ఎలా ఉంటుందో తెలుసా?
అద్వయుడూ, అవ్యయుడూ అయిన హరి సమస్త సృష్టిని తనలో లీనం చేసుకొని జలశయనుడు అయ్యాడు. హరి తన యోగ నిద్ర నుండి మేల్కొనగానే బుధజన సేవ్యుడు అయిన బ్రహ్మ అతని నాభికమలం నుండి ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ తాను ఎవరో, తన జన్మకు కారణభూతుడూ, మహానుభావుడూ అయిన హరి ఎవరో తెలిసికోలేని అజ్ఞానస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతనికి “ఓ సత్తముడు అయిన బ్రహ్మా! నువ్వు నన్ను భజించు” అన్న హరి వాక్యాలు వినవచ్చాయి.
హరి వాక్యాల్ని విన్న వెంటనే బ్రహ్మ హరికి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఇలా అన్నాడు : “దేవా! జగన్నాథా! నీకు జయమగుగాక! తత్త్వతః నువ్వు ఎవరో నేను తెలుసుకోలేను. ఓ వరదా! ప్రసన్నుడవు కమ్ము. నేను ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు”.అన్నాడు
అప్పుడు హరి: “ఓ బ్రహ్మా! నువ్వు చింతించవద్దు. నువ్వు సృష్టిని ప్రారంభించు. మహత్త్వయుతమూ – శుభప్రదమూ, స్థావర జంగమరూపమూ, అండజమూ- స్వేదజమూ- జరాయుజమూ – ఉద్భిజ్జమూ అయిన చతుర్విధ సృష్టిని కావించుము.”
అప్పుడు బ్రహ్మ : ఓ సర్వేశ్వరా! అల్పజ్ఞుడ్ని అయిన నాకు సృష్టిని కావించే శక్తి ఎక్కడిది?ప్రవర్ధమానం అయిన సృష్టిని కావించడానికి కావలసిన గొప్ప సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు.అన్నాడు
అప్పుడు విష్ణువు : “ఓ బ్రహ్మదేవుడా! సుదుర్లభములు అయిన వేదాల్ని శక్తితో సహా నా వద్ద నుండి స్వీకరించు. వేదాల్ని తెలుసుకొని నువ్వు సృష్టిస్తే, నీకు ఎప్పుడూ పరాభవం అనేది ఉండదు.”
అలా బ్రహ్మ విష్ణుభగవానుడి దగ్గర నుండి వేద ప్రాప్తిని పొంది స్థావర జంగమాల్నీ, అండజమూ – స్వేదజమూ – జరాయుజమూ – ఉద్భిజమూ అయిన చతుర్విద సృష్టినీ, వివిధ ప్రజల్నీ సృష్టించాడు. భగవానుడు ప్రసాదించిన శక్తి వలన వేద సహాయత వలననూ స్మరణమాత్రం చేతనే బ్రహ్మ అనాయాసంగా మూడు లోకాల్నీ ఆవిర్భవింప చేశాడు.
ఇక్కడ అండజము లనగా, గ్రుడ్డు వలన బుట్టిన పక్షులు మొదలైన జంతువులు. స్వేదజము లనగా, చమట వలన బుట్టిన యూకములనే కీటకములు మొదలైన ప్రాణులు. ఉద్భ్హిజము లనగా, భూమిని వ్రక్కలించుక పుట్టిన వృక్షములు మొదలయిన ప్రాణులు.
జరాయుజములు = జరాయువువలనపుట్టునవి = మనుష్యాదులు. జరాయువు అంటే గర్భసంచి లేదా గర్భముతిత్తి. అండజములు అంటే అండమువలన పుట్టునవి పక్షిసర్పాదులు, అండము = గ్రుడ్డు. స్వేదజములు = చెమటవలన పుట్టునవి = నల్లి మొదలయినవి
బ్రహ్మ ఎలా సృష్టించాడో, ఈ సృష్టి క్రమాన్ని, సాక్షాత్తు వ్యాసభగవానుల వారి వద్ద నుండి సూతుడు , జైమినీ, వైశంపాయనుడూ, పైలాది ఋషులూ విడివిడిగా విన్నారు . బ్రహ్మదేవుడు బ్రహ్మనిష్టులైన సనకాదులనూ, కర్మ నిష్ఠులైన మరీచ్యాది ఋషులనూ సృష్టించి, వారి ద్వారా దేవదైత్యుల్ని సృష్టించాడు. బ్రహ్మ సత్య, త్రేతా, ద్వాపర యుగాల్నీ, ఆ యుగాల ఆదిలోనూ, మధ్యలోనూ ఉండే ధర్మాల్నీ, ప్రత్యేకించి కలియుగాన్నీ – ఆ యుగ ధర్మాల్నీ సృష్టించాడు.
బ్రహ్మ – సత్య యుగాల సంవాదము
ఆ విధంగా యుగాల్నీ, యుగ ధర్మాల్నీ విభజన చేసిన తరువాత లోకానుగ్రహ కామి అయిన బ్రహ్మ సత్యయుగ పురుషుణ్ణి పిలిచి ఇలా అన్నాడు; “నువ్వు ఏ పని లేకుండా నిర్వ్యాపారివిగా ఎందుకు ఉన్నావో శీఘ్రంగా చెప్పు, చెప్పడానికి నీకు సమయం ఉంది.”అని ప్రశ్నించాడు
దానికి సత్యయుగ పురుషుడుఇలా అన్నాడు “నా యుగంలో ప్రజలందరూ విషయ సుఖముల పట్ల విముఖులు. అందరూ వివృత్తి ధర్మపరాయణులే. అందరూ శాంత చిత్తులే. అందరూ హరిభక్తి పరాయణులే. అందరూ శుద్దమనస్కులే. అందరూ దేహ, ప్రాణ, ఇంద్రియ పరాఙ్మఖులే. ప్రజలందరూ వారి వారి ధర్మాల్ని తూచ తప్పకుండా ఆచరిస్తున్నప్పుడు వారిని నియంత్రణ చేయడానికి, శాశించ డానికి ఆవశ్యకత లేనేలేదు కదా! మేమందరం నీ ఆజ్ఞ పాటించే వారమే కాని స్వతంత్రించి వ్యవహరించే వారము కాము. ప్రజలు శాంతులూ – నివృత్తి ధర్మపరాయణులూ – భగవత్పారాయణులునూ. ప్రజలు కర్మ కాలము – గుణాల్నీ వ్యతిరేకించే వారు కారు. ఆశాస్తులూ – ఆర్తులూ – భగవత్ పరాఙ్మఖులూ నిందింపదగిన వారు.” అని బ్రహ్మ తో పలికాడు
దానికి బ్రహ్మ: “నువ్వు శీఘ్రంగా మృత్యులోకానికి వెళ్ళి నీ యుగధర్మాల్ని అక్కడ వ్యాపింపచెయ్యి. ఎప్పుడూ కాలమే మెల్లమెల్లగా ధర్మాన్ని ప్రవర్తింప చేస్తుంది. అన్ని యుగాల్లోనూ సర్వదా పుణ్యాత్ములూ, పాపాత్ములూ ఉంటూనే ఉంటారు.”అన్నాడు
సత్యయుగ స్వరూపము :
సత్య యుగంలో వైరాగ్యం అధికంగా ఉంటుంది. సత్య యుగ పురుషుడు సంపూర్ణ జ్ఞాన నిగ్రహుడుగా ఉంటాడు. అతడు యజ్ఞోపవీత ధారి. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. అతడు బ్రాహ్మణ ప్రియుడు. ఇటువంటి స్వరూప లక్షణాలు కలిగిన సత్య యుగ పురుషుణ్ణి బ్రహ్మ సృష్టించాడు. ఈ ప్రకారమే త్రేతాయుగమూ – ద్వాపర యుగమూ – కలియుగమూ ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉంటాయి.
త్రేతాయుగ స్వరూపము త్రేతాయుగ పురుషుడు స్వధర్మ పరాయణుడు. యజ్ఞయాగాది వైదిక క్రతువులను చేయడానికి చిహ్నంగా త్రేతాయుగ పురుషుడు చేతిలో స్రువాన్ని ధరించి ఉంటాడు. అతడు ధర్మ ప్రియుడుగా ఉండి ప్రజలలో ధర్మ వ్యాప్తిని చేసేవాడుగా ఉంటాడు.
ద్వాపర యుగ పురుషుడు:
ద్వాపర యుగ పురుషుడు ఖడ్గమూ ఖట్వాలగమూ – ధనుర్భాణాల్నీ చేతిలో ధరించి ఉంటాడు. అతడు అశాంతుడు. పుణ్య పాపశీలి, కటువుగా ఉంటాడు.
కలియుగ స్వరూపము :
వివేకవంతులకు కలిలో శీఘ్రంగా ఫలం లభిస్తుంది. కలిలోని ప్రజలు పరమార్థ విచారహీనులు. ఈ యుగంలోని ప్రజలకు దుష్టవిచారమే తప్ప శిక్ష విచారం ఉండదు. కలి పురుషుడు పిశాచ వదనంతో చూడడానికి అసహ్యంగానూ, భయంకరంగానూ ఉంటాడు. అతడు క్రూరుడు, కలహ ప్రియుడు. అతడు ఎడమ చేతితో శిశ్నాన్నీ, కుడిచేతిలో జిహ్వని పట్టుకొని నాట్యం చేస్తున్నాడు. ఆ కలిపురుషుడు బ్రహ్మదేవుణ్ణి చూసి నవ్వుతూ, దుఃఖిస్తూ, రోదనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి స్వరూపము, లక్షణాలూ కలిగిన కలిపురుషుణ్ణి బ్రహ్మ నవ్వు మొగముతో ఇలా అంటాడు.
“ఓ కలీ! అంగాన్నీ, జిహ్వనీ, గట్టిగా పట్టుకొని మాటిమాటికీ ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఆకతాయి వలె కనిపిస్తున్న నీవు వెళ్లి స్వకార్య నిర్వహణ తత్పరుడవు కావలసింది.”
దానికి కలి :
ఓ సర్వేశా! నేను సర్వాన్నీ నాశనం చేసేవాణీ, నిరంకుశుణ్ణి. ఆనంద రహితుణ్ణి నిద్రాకలహాలు మక్కువగా కలవాణ్ణి. పర స్త్రీని, పర ద్రవ్యాన్ని కోరేవాణ్ణి. పరులకు ద్రోహు తల పెట్టేవాణ్ణి. వంచకుణ్ణి దంభమూ – మాత్సర్యమూ – భేదమూ అంటే ఇష్టపడే జనుల్ని చూస్తే నాకు ఇష్టం. అటువంటి నన్ను భూలోకానికి పంపించవద్దు. ఏకాంతమూ – యోగ సాధనా – సన్యాసమూ అనే వేషాలతో ఉదరపూరణ చేసికొనే వాళ్ళు తమర్నీ, ఇతర్లనీ నా సంపర్కం వల్ల మోసగిస్తూ ఉంటారు.” అన్నాడు
దానికి బ్రహ్మ :
“నీ ప్రభావం సోకినవాళ్ళు పాపాత్ములు కాగా, నీ ప్రభావానికి లోబడని వాళ్ళు పుణ్యాత్ములుగా ఉంటారు. నువ్వు శీఘ్రఫలకారివి కావడం చేత పాపాత్ములు పెరిగినట్లే – పుణ్యఫలం శీఘ్రంగా లభిస్తుందన్న ఆశతో కొంత మందైనా పుణ్యాత్ములు ఉద్యమశీలురు అవుతారు. తమ పుణ్య ప్రభావం చేత కలి ప్రభావాన్ని తట్టుకొని అల్పాయుర్దాయం కలవాళ్ళం అని తెలుసుకొని తమ మంచి కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళకి నా ఆజ్ఞగా భావించి శీఘ్రఫలం కలిగేటట్లు సహాయం చెయ్యి” అని కలిని శాసించాడు.