పూర్వం ఒకసారి శౌనకాది ముని బృందం శ్రీసూత మహామునికి ఆహ్వానించి సత్కరించి, మహాబాగా ధనాన్ని ఎలా సంపాదించాలి? దానిని ఎలా కాపాడాలి? ఎలా ఖర్చు చేయాలి? అర్థదూషణం అంటే ఏమిటి? అనే విషయాలను వివరంగా చెప్పవల్సిందని కోరారు. మునుల అభ్యర్థన మేరకు సూతుడు సంతోషించి ‘నాయనలారా జాగ్రత్తగా వినండి. అర్థమును గురించిన అన్ని విశేషములను మీకు ఇప్పుడు చెబుతాను అన్నారు.
బుద్ధిశాలి అయిన వాడు ధర్మమునకు విరుద్ధంగా ధనమును సంపాదించకూడదు. ఏ యుగంలోనైనా ఇలానే సంపాదన చేయాలి. కలియుగంలో జరిగే ధర్మవిరుద్ధమైన సంపాదన వల్ల మనిషి వ్యాధుల రూపంలో బాధపడతాడు. లేదా కుటుంబ సభ్యులకు సంభవించే ఆపదలు-కష్టాల వల్ల అట్టి సంపాదనఅంతా ఖర్చు అయిపోతుంది. ధర్మపరంగా సంపాదించిన ధనాన్ని (అర్థమును) దాన, ధర్మ, భోగాలకు ఆలోచించి ఖర్చు చేయాలి. అలా చేయకపోవడాన్నే ‘అర్థదూషణ’మని (డబ్బును దూషించడం) అంటారు. ప్రతిమనిషికి
ఏడు బలహీనమైన అలవాట్లుంటాయి. ఒక్కొక్కసారి వీటిలో ఏది బలవత్తరమైనదో మనిషి దానికి బానిస అవుతుంటాడు. దీనినే మన పెద్దలు ‘వ్యసనము’ అని పేర్కొన్నారు. సంస్కృత భాషలో వీటినే సప్తవ్యసనాలని’ పిలిచారు. (సప్తవ్యసనాలు: వెలది, జూదము, పానము, వేట,వాగ్దూషణం దండనం, అర్ధదూషణం) సప్తవ్యసనాలలో అర్థదూషణం చివరిది. బలమైనది. మనిషికి ఎంతైనా సంపదలు వుండవచ్చు. సంపదలు వున్నాయి కదా! అని డబ్బును సంపాదించక, పొగడ్తల కోసం, చెడు పనుల కోసం డబ్బును ఖర్చు చేసేవాడు అర్థదూషణను చేస్తున్నాడని తెలుసుకోవాలి.
డబ్బును (అర్థమును) సంపాదించని, గౌరవించని, వినియో గించని (ఖర్చు) వాడిని ఎవ్వరూ దరికి రానివ్వరు. ముందూవెనక చూడకుండా ఎవరికిపడితే వారికి అదేపనిగా ధనత్యాగం చేయడం కూడా డబ్బును దూషించడమే! (అర్థదూషణ) అవుతుంది. అన్యాయం చేసి, ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి, దొంగతనంచేసి డబ్బును సంపాదించకూడదు! అలా చేస్తే డబ్బును దూషించినట్లే అవుతుంది. అర్థదూషణం చేసే వ్యక్తికి ఎటువంటి గతి కల్గుతుందో ‘ఖనినేత్రుడు’ అనే రాజు కథ ద్వారా తెల్సుకుందామన్నాడు సూతుడు.
పూర్వం మను వంశజుడు అయిన ఖనినేత్రుడు అనే మహారాజు పూర్వజన్మ వాసనలవల్ల చెడుసావాసాలను మరిగి, నీతి-నియమాలు, ధర్మాన్ని అతిక్రమించి, ప్రజలను పీడిస్తూ! అన్యాయంగా ఎంతో ధనాన్ని సంపాదించాడు. పోనీ అలా కూడబెట్టిన ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించాడా అంటే అదీ లేదు. వ్యసనపరుడైన ఆతడు తన ధనాన్ని వేషగాళ్ళకు, జూదరులకు, వ్యభిచార మద్యవర్తులకు, వేశ్యలకు, పాషండులకు లక్షల కోట్ల ధనాన్ని వద్దని అంటున్నా ధారపోశాడు. అటు దైవకార్యాలకూ ఇటు ధర్మకార్యాలకూ ధనాన్ని ఖర్చు పెట్టకపోవడం వలన ఆతడు ఇహపరాలకూ రెండిటికినీ దూరం అయ్యాడు.
అయితే ఏ జన్మలోనో మిగిలిన నువ్వుగింజంత పుణ్యకర్మ వలన రాజుకు గుణవంతుడైన ‘సువర్చనుడు’ అనే కొడుకు కలిగాడు. వటువైన సువర్చనుడు వశిష్ట మహాముని దగ్గర విద్యను అభ్యసించాడు. ప్రజలు విద్యావంతుడు గుణవంతుడైన సువర్చనుడిపట్ల ప్రేమానురాగాలను పెంచుకొని, అంతా ఒకటై విప్లవాన్ని లేవదీసి దుష్టుడైన ఖనినేత్రుని రాజ్యం నుంచి వెలివేశారు. అనంతరం వశిష్టులవారు స్వయంగా సువర్చు నుడుని రాజుగా అభిషేకించి, తండ్రి అన్యాయంగా సంపాదిం చిన ధనాన్ని అర్హులైన వారికి దాన ధర్మాలు చేయమని వెడలిపోయాడు.
గురువు ఆజ్ఞను శిరసావహించి సువర్చనుడు ముందూవెనుకా చూడకుండా బొక్కసంలో వున్న ధనాన్నంతా దానధర్మాలకు ఖర్చుచేయడంతో రాజ్యం ఆర్థికపరమైన ఇబ్బం దులలో చిక్కుకుంది. ఇదే అదనుగా పొరుగు వున్న రాజ్యాలు సువర్చనుడిపై దండయాత్ర ప్రకటించాయి. సమస్యలన్నీ ఒక్కసారిగా రావడంతో ఎటూతోచని సువర్చనుడు వశిష్టుల వారిని మనసులో ధ్యానించి, తాను చేసిన ధర్మాలు నిజమైనవిఅయిన పక్షంలో అవి తననూ, తన రాజ్యాన్ని రక్షించాలని తలుస్తూ, తన రెండు అరచేతులను మర్దించాడు. ఆ మర్దనలో ధర్మదేవత కన్పించి చతురంగ బలాలతో కూడిన పెద్ద సైన్యాన్ని సువర్చనుడికి ఇచ్చి ‘విజయుడవుకమ్మని దీవించి పంపింది. యుద్ధంలో శత్రురాజులు ఓటమి పాలుకావడంతో, తమవంతు కప్పాలను (పన్నులను) సువర్చనుడి కోశాగారానికి సమర్పించారు. దానితో కోశాగారం తిరిగి సుభిక్షమైంది. దాంతో ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు అని ముగించాడు సూతుడు.
కాబట్టి మునులారా! అన్యాయంగా ధనాన్ని సంపాదిం చినవాడు చూచేవారికి సుఖంగా వున్నట్లు కన్పించవచ్చుకానీ వారికి చెప్పుకోలేని కష్టాలు తప్పక వుండితీరుతాయి. అలాగే వారు అనుభవించే సుఖ-భోగాలు సైతమూ క్షణభంగురాలే అని తెల్సుకోవాలి. అర్థదూషణం చేసినవారికి డబ్బు ఉండవచ్చుకానీ మానసిక శాంతి, శారీరకమైన ఆరోగ్యమూ ఉండవు. ఇది యుగయుగాలుగా నడుస్తున్న చరిత్ర. అర్థదూషణాపరులను చూచి, అదే మార్గాన డబ్బు సంపాదించాలని ప్రయత్నించకండి! ‘అలా చేస్తే పైకథలో చెప్పినట్లుగా మనమూ ఇబ్బందుల పాలుకావల్సి వస్తుంది.