ఆయన గొంతు ఎస్పీ బాల సుబ్రహ్యణ్యంలా వినసొంపుగా ఉండదు. ఆయనేమీ సంగీత సాధన చేయలేదు. స.రి.గ.మ.ప.ద.ని.స అంటూ ఆయన ఏ గురువు వద్ద నేర్చుకోలేదు. ప్రజా సమస్యలే ఆయన గొంతుకలకు స్వరవీణలుగా మారాయి. పక్క వాద్యాలేమీ ఆయన పాటకు ఉండవు. ఆయన పాట వింటేనే సరిపోదు. ఖచ్చితంగా కనులతో చూడాల్సిందే. అంటే చెవులు.. కళ్లు వేదికపై ఉంటేనే ఆయన పాటను ఆస్వాదిస్తాం. అప్పుడే ఆ పాట అర్థమవుతుంది. గుండెల్లో నాటుకు పోతుంది. ఒక్కసారి పాట వింటే చాలు .. శాశ్వతంగా మదిలో గుర్తుండిపోతుంది. ఆయనే గుమ్మడి విఠల్ రావు. ప్రజా గాయకుడు గద్దర్.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ…
ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితమైన వ్యక్తి. కొన్ని రోజుల నుంచి ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన ఊపరితిత్తులు, యూరినరీ సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు హార్ట్ సర్జరీ కూడా అయింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రజాయుద్ధనౌకగా ఆయనకు పేరు. షుగర్, బీపీ సమస్యలు పెరిగి పోవడంతోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఉద్యమాలకు ఊపిరి…
ఉద్యమాలకు ఆయన పాట ఊపిరి పోసింది. అలనాటి కమ్యునిస్టుల ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకూ ఆయన పాట ఆగలేదు. అదే బాణి. అదే ఆహార్యం అయినా ఆయన కాలికి గజ్జ కట్టి పాట పడితే యువత నుంచి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉర్రూతలూగాల్సిందే. గంట పాటు చేసిన ప్రసంగం కంటే ఒక పాట అందులోని ఒక పదం చాలు చెయ్యెత్తి ఉద్యమానికి సై అనేంతగా అన్నట్లు సాగేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా అని ఆయన పాడిన పాట యువతను పోరు బాట పట్టించింది. పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకూ కుర్రకారు ఉద్యమంలోకి కదలి వచ్చిందంటే ఈ పాట పుణ్యమే.
1980వ దశకం నుంచి…
1980వ దశకం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గద్దర్ వస్తున్నారంటే… అదొక జాతరలా మారిపోయేది. పల్లె నుంచి పట్నం దాకా గద్దర్ చేసిన అనేక కార్యక్రమాలు పేదల అభ్యున్నతికోసమే. బ్యాంకు అధికారిగా రాజీనామా చేసి పేదల సంక్షేమం కోసం, పెత్తందారులపై పోరాటం కోసం ఆయన పెగిల్చిన గొంతు ఆగలేదు. దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంది. 1980 దశకాల్లో గద్దర్ పాటల క్యాసెట్లు రూపంలో ప్రతి గ్రామాల్లో మారుమోగుతుండేవన్నది కాదనలేని వాస్తవం. గద్దర్ ఇంజినీరింగ్ పట్టభద్రుడని కొందరికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల కోసం తన గొంతుకను ఊరూ వాడలా వినిపించారు.
షుగర్ లెవెల్స్ పడిపోవడంతో…
గద్దర్ వయసు 77 ఏళ్లు. గత నెల 20న అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఈ నెల మూడో తేదీన గుండె ఆపరేషన్ చేశారు. బైపాస్ సర్జరీ చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో గద్దర్ ఊపిరి ఆగిపోయింది. షుగర్ లెవెల్స్ కూడా ఒక్కసారిగా పడిపోయాయని, మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని అపోలో వైద్యులు వెల్లడించారు. గద్దర్ మరణంతో ఒక ఉద్యమ గీతం ఆగిపోయింది. ఒక జనం గొంతుక మూగవోయింది. ఆయన కుటుంబ సభ్యులకు “రైట్ టైమ్స్ మీడియా” ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తుంది. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. గద్దర్ భౌతికంగా లేకపోయినా ఆయన పాట మాత్రం కలియుగం ఉన్నంత కాలం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.