కుర్రోళ్లు విదేశీ గడ్డపై పెద్దగా రాణించలేకపోతున్నారు. తోపుగాళ్లనుకున్న ఆటగాళ్లు సయితం చేతులెత్తేస్తున్నారు. వన్డే, టెస్గ్ మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ టీ 20లలో మాత్రం తడబడుతూనే ఉంది. నిన్న జరిగిన రెండో మ్యాచ్లోనూ భారత్ వెస్టిండీస్ పై ఓటమి పాలయింది. మొదటి మ్యాచ్లో ఓడిపోయి పాఠాలు నేర్చుకుందనుకున్నా… కానీ అవే తప్పులు.. అవే షాట్లు.. తిరిగి వెస్టిండీస్ చేతిలో టీ 20 సిరీస్ పెట్టేసేటట్లే కనపడుతుంది. ఐదు మ్యాచ్లున్న టీ 20 సిరీస్లో ఇప్పటికే విండీస్ 2 – 0 తో ఆధిక్యంతో కొనసాగుతుంది.
హైదరాబాదీ ఆటగాడి పుణ్యమే…
రెండో మ్యాచ్లోనూ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ రాణించడంతోనైనా ఆమాత్రం స్కోరైనా చేయగలిగాం. తోపులనుకున్న బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. వరసగా రెండో మ్యాచ్లోనూ శుభమన్ గిల్ అట్లర్ ప్లాప్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ది కూడా అదే పరిస్థితి. రన్ అవుట్ అయి నిరాశపర్చాడు. కొద్దిగా హార్ధిక్ పాండ్యా ఉండగా స్కోరు బోర్డు పరుగులు తీసినట్లు కనిపించినా అవుట్ కావడంతో తర్వాత భారత్ 20 ఓవర్లకు 152 పరుగులు చేసింది. అదీ తెలుగు కుర్రాడు తిలక్ ఆఫ్ సెంచరీ పుణ్యమేనని చెప్పుకోవాలి. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయినట్లే లెక్క.
పూరన్ దెబ్బకు…
153 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి మూడు వికెట్లు టపా.. టపా కూలిపోయినా పూరన్ నిలదొక్కుకోవడంతో మ్యాచ్ వారి పరమయింది. పెద్ద టార్గెట్ ను కూడా పూరన్ చిన్నదిగా మార్చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఉంచిన లక్ష్యాన్ని వెస్టిండీస్ బౌలర్లు ఛేదించడానికి అంత కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. భారత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా చివరకు వెస్టిండీస్కే విజయం దక్కింది. పూరన్ 67 పరుగుల చేసి జట్టుకు సులువుగా విజయాన్ని తెచ్చి పెట్టారు. ఇక మూడో మ్యాచ్కైనా టీం ఇండియా యువజట్టు కొంత కోలుకుంటుందని ఆశిద్దాం.